నిర్గమ. 38. అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు. దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు. బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు. బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు. ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు. ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు. గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు. అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు. ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు. ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు. తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు. ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు. ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు. ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు. స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు. ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు. వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి. మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు. యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు. దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి. పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్. జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్. ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం. అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు. 1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు. అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు. అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు. ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.