లేవీ. 15. యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు. “మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు. అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే. అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది. అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు. శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది. అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి. స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి. స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు. ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు. ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది. ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది. ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది. ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది. వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది. ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి. శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ, బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.”