సంఖ్యా. 33. మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు. మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు. ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు. పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు. ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు. ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు. సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు. దోపకా నుండి ఆలూషుకు వచ్చారు. ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు. రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు. అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు. కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు. హజేరోతు నుండి రిత్మా వచ్చారు. రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు. రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు. లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు. రీసా నుండి కెహేలాతాకు వచ్చారు. కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు. షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు. హరాదా నుండి మకెలోతుకు వచ్చారు. మకెలోతు నుండి తాహతుకు వచ్చారు. తాహతు నుండి తారహుకు వచ్చారు. తారహు నుండి మిత్కాకు వచ్చారు. మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు. హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు. మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు. బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు. హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు. యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు. ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు. ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు. కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు. యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు. అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు. అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు. వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు. సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు. పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు. ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు. ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు. దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు. అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు. అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు. వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు. యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను. మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు. అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”