నెహెమ్యా. 11. ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు. యెరూషలేంలో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు. ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాలవారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు. యూదుల నాయకుల్లో కొందరు, బెన్యామీనీయుల నాయకుల్లో కొందరు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. యూదుల నాయకుల జాబితాలో ఉన్నవారు ఎవరంటే, జెకర్యా మనవడు ఉజ్జియా కొడుకు అతాయా. జెకర్యా తండ్రి అమర్యా, అమర్యా తండ్రి షెఫట్య, షెఫట్య తండ్రి పెరెసు వంశీకుడైన మహలలేలు. కొల్హోజె మనవడు బారూకు కొడుకు అయిన మయశేయా. కొల్హోజె తండ్రి హజాయా, హజయా తండ్రి అదాయా, అదాయా తండ్రి యోయారీబు, యోయారీబు తండ్రి జెకర్యా. జెకర్యా షెలా వంశం వాడు. యెరూషలేంలో నివసించిన పెరెసు వంశంవారు పరాక్రమవంతులైన 468 మంది. బెన్యామీనీయుల వంశంలో ఉన్నవారు, యోవేదు మనవడు, మెషుల్లాము కొడుకు సల్లు. పెదాయా కొడుకు యావేరు, కోలాయా కొడుకు మయశేయా, మయశేయా కొడుకు కాలాయా, ఈతీయేలు కొడుకు మయసీయా, మయసీయా కొడుకు యెషయా. సల్లును అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి. వీరంతా మొత్తం 928 మంది. జిఖ్రీ కొడుకు యోవేలు వారికి నాయకుడుగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు. యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను. శెరాయా దేవుని మందిరంలో అధిపతిగా ఉన్నాడు. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబుల పూర్వీకుల క్రమంలో హిల్కీయాకు పుట్టాడు. నిర్మాణ పని చేసినవాళ్ళ బంధువులు 822 మంది, పూర్వీకులైన మల్కీయా, పషూరు, జెకర్యా, అమీజు, పెలల్యాల క్రమంలో యెరోహాముకు పుట్టిన అదాయా. పెద్దల్లో ప్రముఖులైన అదాయా బంధువులు 242 మంది. పూర్వీకులైన ఇమ్మేరు, మెషిల్లేమోతె, అహజైయల క్రమంలో అజరేలుకు పుట్టిన అమష్షయి. పరాక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదోలిము కొడుకు జబ్దీయేలు. లేవీయుల నుండి షెమయా. ఇతడు అజ్రీకాము మనవడు, హష్షూబు కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు, హషబ్యా బున్నీ కొడుకు. లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు. ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు. పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది. ద్వారపాలకులు అక్కూబు, టల్మోను. ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది. ఇశ్రాయేలీయుల్లో మిగిలిపోయిన యాజకులు, లేవీయులు, ఇతరులు అన్ని యూదా పట్టణాల్లో ఎవరి వంతులో వారు ఉండిపోయారు. దేవాలయం పనివారు ఓపెలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు. యెరూషలేంలో ఉన్న లేవీయులకు నాయకుడు ఉజ్జీ. ఇతడు మీకా మనవడు, మత్తన్యా కొడుకు హషబ్యాకు పుట్టిన బానీ కొడుకు. ఆసాపు సంతానం వాళ్ళు గాయకులు, దేవుని మందిరం పనులు పర్యవేక్షించే వారిపై అధికారులు. వీరు చేయాల్సిన పని ఏమిటంటే, గాయకులు నిర్ణయించిన సమయంలో తమ వంతుల ప్రకారం క్రమంగా పనిచేసేలా చూడాలి. రాజు నిర్ణయించిన రోజువారీ పనులు క్రమంగా జరిగించాలి. యూదా గోత్రం వాడైన జెరహు వంశంలో పుట్టిన మెషేజబెయేలు కొడుకు పెతహయా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించే పనిలో రాజు దగ్గర ఉన్నాడు. గ్రామాల, పొలాల విషయంలో, యూదా వంశం వారిలో కొందరు కిర్యతర్బా, దానికి చెందిన ఊళ్లలో, దీబోను, దానికి చెందిన ఊళ్లలో, యెకబ్సెయేలు, దానికి చెందిన ఊళ్లలో నివసించారు. ఇంకా, యేషూవ, మోలాదా, బేత్పెలెతు ఊళ్ళలో, హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో, సిక్లగులో, మెకోనాలకు చెందిన ఊళ్లలో, ఏన్రిమ్మోను, జొర్యా, యర్మూతు ఊళ్ళలో, జానోహ, అదుల్లాము, వాటికి చెందిన ఊళ్లలో, లాకీషులో ఉన్న పొలంలో, అజేకా, దానికి చెందిన ఊళ్లలో నివాసం ఉన్నారు. బెయేర్షెబా నుండి హిన్నోము లోయ దాకా వారు నివసించారు. గెబ నివాసులైన బెన్యామీనీయులు మిక్మషులో, హాయిలో, బేతేలు వాటికి చెందిన ఊళ్లలో, అనాతోతులో, నోబులో, అనన్యాలో, హాసోరులో, రామాలో, గిత్తయీములో, హదీదులో, జెబోయిములో, నెబల్లాటులో, లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు. లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాలవారు కొన్ని భాగాలు పంచుకున్నారు.