యోబు. 21. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు. నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో. నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు? మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి. ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది. భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు? వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి. వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది. వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు. వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు. వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు. వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు. “మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?” అని వాళ్ళు అడుగుతారు. వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక. భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా. ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా. “వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు” అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి. తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి. వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది? దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా. ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు. అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు. ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి. నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను. “ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా. దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు? వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది. పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు. మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?