యోబు. 33. యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను. ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది. నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు. దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి. నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది. ఏమంటే “నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి. ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు” అని నీవంటున్నావు. నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు. నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు. దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు. ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు. మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి, గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి, వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు. రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది. వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి. వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది. మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే, ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో “పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది” అని గనక అంటే, అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది. వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు. కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.” చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు. కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు. యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను. చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో. అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.