కీర్తన. 48. ఒక పాట, కోరహు వారసుల కీర్తన. మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి. అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది. దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు. చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు. వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది. తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు. సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు. దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం. దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది. న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ. సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు. తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు. ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.