కీర్తన. 132. యాత్రల కీర్తన యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో. అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో. నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా, యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను. నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను. ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది. యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం. యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా. నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక. నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు. నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు. నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు. తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు. ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను. దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను. దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు. అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను. అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.