కీర్తన. 137. మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం. మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు. మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం? యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక. యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా. నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.