సామెత. 29. చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు. మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు. న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు. తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు. దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు. మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు. అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు. జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు. రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు. బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు. రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు. పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు. దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు. నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు. ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు. సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు. తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు. ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి. కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు. ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు. దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు. భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే. మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.